తూడు తొలగించే వరకూ కదిలేది లేదు: మంత్రి పేర్ని నాని
ABN , First Publish Date - 2020-07-12T16:43:06+05:30 IST
మంత్రి పేర్ని నాని చొరవతో డ్రైనేజీ అధికారులు తక్షణం..
తోట్లవల్లూరు(కృష్ణా): మంత్రి పేర్ని నాని చొరవతో డ్రైనేజీ అధికారులు తక్షణం ఏనుగులకోడు డ్రెయిన్లో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేపట్టారు. వల్లూరుపాలెం, రొయ్యూరుల్లో ఏనుగులకోడు డ్రెయిన్లో డెక్క, తూడు పేరుకుపోయి పొలాలు ముంపునకు గురయ్యాయి. సమస్యను ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ శనివారం మంత్రి పేర్ని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి వల్లూరుపాలెం, రొయ్యూరుల్లో డ్రైనేజీని పరిశీలించారు. రూ.18 లక్షలతో టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ డెక్క తొలగింపు చేపట్టకపోవటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెక్క తొలగింపు పనులు చేపట్టే వరకు తాను వెళ్లనని మంత్రి భీష్మించారు. డ్రైనేజీ ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈ జి.గోపాల్, డీఈ శ్రీనివాసులు స్పందించి తక్షణం యంత్రాన్ని తీసుకువచ్చి డెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఆ తరువాత మంత్రి అక్కడ నుంచి వెళ్లారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.