యమధర్మరాజు.. చిత్రగుప్తుడు.. ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్!

ABN , First Publish Date - 2021-04-17T21:12:35+05:30 IST

ఇటువంటి వారి కోసమే అన్నట్టు ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యమధర్మరాజు.. చిత్రగుప్తుడు.. ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: దేశంపై కరోనా రెండో దాడి జరుగుతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే వ్యాధి కట్టడికి మార్గమని ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయినా ఇప్పటికీ కొందరిలో అదే నిర్లక్ష్యం! క్షణాల్లో పరిస్థితి అదుపు దాటిపోవచ్చని తెలిసీ అదే దిలాసా! మాస్కులు లేకుండా.. సామాజిక దూరం పాటించకుండా.. నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఇప్పటికీ అనేక మంది ప్రమాదంలో పడుతూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తెస్తున్నారు. చిన్న చిన్న నిబంధనలు పాటించి కరోనాకు చెక్ పెట్టొచ్చని తెలిసీ బాధ్యతారాహిత్యంతో కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు.


ఇటువంటి వారి కోసమే అన్నట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా సిగ్నల్ వండర్‌ బాక్సులోని పర్ఫెక్ట్ సందేశం ఇది అంటూ ఆయన యమధర్మరాజుకు చిత్రగుప్తుడికీ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణను ట్వీట్ చేశారు.


వారి మధ్య సంభాషణ ఇలా... 

యమధర్మరాజు: నువ్వు భూమ్మీదకు వెళ్లావు కదా.. ఏమైంది..?

చిత్రగుప్తుడు: మహారాజా.. అక్కడ చాలా మంది మాస్కులు పెట్టుకున్నారు. వారిని నేను గుర్తుపట్టలేకపోయా! కాబట్టి మాస్కులు లేని వారినే తీసుకొచ్చా..! 


ఈ సంభాషణను షేర్ చేసి ఆనంద్ మహీంద్రా..ఇది హెచ్చరికల కంటే మెరుగ్గా పనిచేసే సందేశం అని కామెంట్ చేశారు. సూటిగా మనసులో నాటుకునేలా ఉందని అభిప్రాయపడ్డారు. సహజంగానే ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు కూడా మాస్కులు ధరించాలని చెప్పే ఆసక్తికర సందేశాలను షేర్ చేస్తున్నారు. ‘కరోనా పనిపట్టే అత్యద్భుత వ్యాక్సిన్‌ను సివిల్ ఇంజినీర్లు ఎప్పుడో కనిపెట్టారు. అదే ఇల్లు.. ఈ సమయంలో ఇల్లు దాటకండి.. కరోనా బారిన పడకండి’ అంటూ ఓ నెటిజన్ ఆనంద్ మహింద్రాకు ఆసక్తికరంగా రిప్లై ఇచ్చారు. 



Updated Date - 2021-04-17T21:12:35+05:30 IST