అతను దోషి!
ABN , First Publish Date - 2022-05-20T12:58:29+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్ను విడుదలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. పేరరివాలన్
- పేరరివాలన్ విడుదలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాలు
ప్యారీస్(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్ను విడుదలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. పేరరివాలన్ విడుదల వ్యవహారంలో సుప్రీంకోర్టును విమర్శించకుండా అతను దోషి అని రాష్ట్ర కాంగ్రెస్ ఘంటాపధంగా చెబుతోంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నోటికి శ్వేత వస్త్రం చుట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కొనసాగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ అళగిరి మీడియాతో మాట్లాడుతూ, పేరరివాలన్ తల్లి అర్బుతమ్మాళ్ సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల విజయం సాధించారని ద్రావిడ పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారని, అయితే మానవ బాంబు పేలుడు సంఘటనలో రాజీవ్గాంధీతో పాటు మరణించిన 16 మంది కుటుంబసభ్యుల మనోభావాలు, వారు ఇన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. రాజధాని నగరం చెన్నైలో 11 ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొని ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఉత్తర చెన్నై పశ్చిమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జె.ఢిల్లీబాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నిర్వాహకులు తాళ్లూరు సురేష్, అగరం గోపి తదితరులు పాల్గొన్నారు. సైదాపేట జంక్షన్లోని రాజీవ్గాంధీ విగ్రహం ఎదుట, తండయార్పేట, థౌజండ్ లైట్స్, కొరట్టూరు, హార్బర్, ట్రిప్లికేన్, ఆదంబాక్కం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళన పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు పేరరివాలన్ను ప్రశంసించడం వల్ల భవిష్యత్తులో అరాచకాలు, విధ్వంసాలు అధికంగా తలెత్తే అవకాశముందని ఘాటుగా విమర్శించారు. అదే విధంగా, కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లోని రాజీవ్గాంధీ స్మారక స్థలంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.