రోజుకు 900 కేసులు!
ABN , First Publish Date - 2020-03-31T09:18:17+05:30 IST
ప్రభుత్వం పదేపదే చెప్తున్నా లాక్డౌన్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 900కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి సెక్షన్
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పదేపదే చెప్తున్నా లాక్డౌన్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 900కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి సెక్షన్ 269, 270 కింద ఏపీ పోలీసులు 7,060 కేసులు నమోదు చేశారు. సుమారు పదివేల వాహనాలు సీజ్ చేశారు. కరోనా వైర్సను కట్టడి చేసేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రధానమంత్రి నుంచి స్థానిక పోలీసుల వరకూ చెబుతూనే ఉన్నా కొందరు రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విషయమై డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజల ప్రాణాలే ముఖ్యం. వాళ్ల కోసమే పని చేస్తున్నాం. అందుకే నిబంధనలు విధించి ఇళ్లల్లో ఉండాలని చెప్తున్నాం. అయినా కాదని రోడ్లపైకి వస్తే కేసులు పెట్టక ఏం చేస్తాం’ అనిప్రశ్నించారు. కాగా విదేశాల నుంచి వచ్చిన 22వేల మందిని గుర్తించామని, జియో ట్యాగింగ్ ద్వారా నిఘా పెట్టామని, ఇళ్లు దాటి యాభై మీటర్లు బయటికి వస్తే కంట్రోల్ రూములో అలారమ్ మోగుతుందని, వెంటనే పోలీసులు వెతుక్కుంటూ వెళతారని వివరించారు.