నాకు గోతులు తీసినవాళ్లు పదడుగుల లోతులో పూడుకుపోయారు: సిద్ధూ

ABN , First Publish Date - 2022-03-11T23:40:20+05:30 IST

పంజాబ్ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తొలిసారి..

నాకు గోతులు తీసినవాళ్లు పదడుగుల లోతులో పూడుకుపోయారు: సిద్ధూ

చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తొలిసారి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. తన కోసం గోతులు తీసిన వాళ్లే 10 అడుగుల లోతులో పూడుకుపోయారని వ్యాఖ్యానించారు.


కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య ఏర్పడిన స్పర్ధలు నెలల తరబడి కొనసాగడం, కెప్టెన్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తొలగించి, సిద్ధూను పీపీసీసీ చీఫ్‌గా చేయడం వంటి పరిణామాలు కొద్దికాలం క్రితం చోటుచేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగారు. అయితే, 'ఆప్' హవాలో హేమాహేమీ నాయకులు కొట్టుకుపోయారు. సిద్ధూతో పాటు కెప్టెన్ అమరీందర్, సీఎం చన్నీ, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వంటి అగ్రనేతలు ఓటమి పాలయ్యారు.


దీనిపై సిద్ధూ స్పందిస్తూ...''నాకు గోతులు తవ్విన వాళ్లే అంతకంటే లోతైన గోతుల్లో పూడుకుపోయారు. జరిగిందేదో జరిగింది. ప్రజలు మార్పు కోరుతూ ఆప్‌కు ఓటు వేశారు. వారిని అభినందిస్తున్నాను. కొత్త విత్తనాలు నాటారు. చింత లేదు, కానీ చింతన్ (చర్చ) జరగాలి'' అని అన్నారు. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుందని, మార్పు కోరుతూ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, ప్రజలు ఎన్నడూ తప్పు చేయరని అన్నారు. చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు అంగీకరించారా లేదా అనే విషయం లోతుపాతుల్లోకి తాను వెళ్లదలచుకోలేదని చెప్పారు. ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో 6,750 ఓట్ల తేడాతో సిద్ధూ ఓటమిని చవిచూశారు.

Updated Date - 2022-03-11T23:40:20+05:30 IST