తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొనాలి

ABN , First Publish Date - 2021-12-03T05:01:07+05:30 IST

వర్షాలకు తడిచి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, ప్రజా సంఘాలు, ఏఐకేఎంఎస్‌, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు.

తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొనాలి
బుట్టాయగూడెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

వర్షాలకు తడిచి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, ప్రజా సంఘాలు, ఏఐకేఎంఎస్‌, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.


బుట్టాయగూడెం, డిసెంబరు 2: వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో గిరిజన చిన్న, సన్నకారు రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ధర్ముల సురేష్‌ మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పొగాకు, మొక్కజొన్న, మిరప ఇతర పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. తహసీల్దార్‌ వైవి లక్ష్మీకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు. కారం రాఘవ, కెవి రమణ, ఎస్‌.రామ్మోహన్‌, టి.బాబురావు, వి.భారతి, బి.వినోద్‌, కె.రాముడు, డి.లక్ష్మి పాల్గొన్నారు.


జీలుగుమిల్లి: వర్షాలకు తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వెట్టి సుబ్బన్న డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని నినా దాలు చేశారు. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తహసీల్దారు జి.ఎలీషాకు వినతిపత్రం అందజేశారు. తుర్సం భీమరాజు, కట్టం నాగేశ్వరావు, పెనుమత్స పెద్దిరాజు, యు.భూషణం ఉన్నారు.


చింతలపూడి: తేమశాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. మండల కార్యదర్శి కంచర్ల గురువయ్య మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోయిందని, కొన్నిచోట్ల పంట నేలకొరిగిందని, దీనివలన రైతులు నష్టపోయారని, ధాన్యం కొనుగోలు చేయడానికి 17 శాతం కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తేమశాతం సంబంధంలేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు సంచుల కొరత ఉందని, వాటిని సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో బోడా వజ్రం, టి.బాబు, జానీ, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:01:07+05:30 IST