గజగజ
ABN , First Publish Date - 2020-11-29T05:36:37+05:30 IST
జడివానలకు చలిగాలులు పెరిగి చిత్తూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 28: నివర్ ప్రభావంతో జిల్లాను జడివాన వీడడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలకు తోడు బలమైన ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. దీంతో పెరిగిన చలికి చిత్తూరు ప్రజలు గజగజ వణిపోతున్నారు. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలు నమోదవుతుండగా... శుక్రవారం 25 డిగ్రీలు, శనివారం 27 డిగ్రీలకు పడిపోయింది. రెండు వారాలుగా చలి ఉంటున్నా, మూడు రోజులుగా మరింత పెరిగింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 17 నుంచి 20 డిగ్రీల నడుమ ఉంటున్నాయి. అడపాదడపా భానుడు తొంగిచూస్తున్నా కాసేపటికే నల్లమబ్బులు కమ్ముకుంటున్నాయి. ముసురు వాన దెబ్బకు వారం రోజులుగా అత్యవసర పనులపై తప్ప నగరవాసులు ఇళ్లు దాటి బయటికి రావడం లేదు. చలిగాలులకు చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. తలుపులు, కిటికీలు మూసినా వణుకు తగ్గడం లేదని జనం వాపోతున్నారు.