లక్ష అబద్ధాలతో గద్దెనెక్కిన కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: విజయశాంతి
ABN , First Publish Date - 2022-02-20T04:24:45+05:30 IST
లక్ష అబద్ధాలతో గద్దెనెక్కిన కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష అబద్ధాలతో గద్దెనెక్కిన కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ సర్కార్ అంకెల గారడీ చేస్తోందని, తెలంగాణకు చేసిందేం లేకున్నా... దొరవారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో చేశామని సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆమె మండిపడ్డారు. కానీ ఎంతో చేశామని చేసుకునే ప్రచారానికి మాత్రం తక్కువేం లేదని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా...
''కేసీఆర్ సర్కార్ అంకెల గారడీ చేస్తోంది. తెలంగాణకు చేసిందేం లేకున్నా... దొరవారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో చేశామని సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ఎంతో చేశామని చేసుకునే ప్రచారానికి మాత్రం తక్కువేం లేదు. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇంత వరకు చేయలేదు. 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ, సమగ్ర భూసర్వే వంటి పలు పథకాలను పెండింగ్ జాబితాలో పెట్టేసింది. గతంలోనూ నిరుద్యోగ భృతి కోసం రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి, వాటిని ఇవ్వకుండా జాప్యం చేయడానికి... ఇతర రాష్ట్రాల్లో ఉన్న పథకాల పరిశీలన పేరిట అధికారులకు పనులు అప్పజెప్పి చేతులు దులుపుకుంది. 2021–22 బడ్జెట్లో నిరుద్యోగ భృతి మాటే లేకుండా చేసింది. బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు... విడుదల చేసిన నిధులు చూస్తే మూరెడు ఇదీ టీఆర్ఎస్ సర్కార్ పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తూ రాజకీయ పబ్భం గడుపుతోంది. బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్దే. లక్ష అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్... నీ దగాకోరు ప్రచారాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారే నీకు, నీ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు.'' అని విజయశాంతి అన్నారు.