ప్రజలను అప్రమత్తం చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T06:08:27+05:30 IST
భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను నాయకులు తీసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
ఇల్లంతకుంట, జూలై 23: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను నాయకులు తీసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పలు గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా మానకొండూర్ నియోజకవర్గంలో మూడు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం ఇంటికి మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మండల కోఆప్షన్ సభ్యుడు సలీం నివాసంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, ఉపాధ్యక్షుడు సుదగోని శ్రీనాథ్గౌడ్, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్యయాదవ్, ఎంపీటీసీ తీగల పుష్పలత, రైతుబందు జిల్లా డైరెక్టర్ ఏలేటి మాధవరెడ్డి, తహసీల్దార్ బావ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రసమయికి సన్మానం
రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఇల్లంతకుంటకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మిబాలరాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో శుక్రవారం ఏర్పాటు చేసి న కార్యక్రమంలో రసమయి మాట్లాడారు. అన్ని రంగాల్లో మండలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జడ్పీవైస్ చైర్మన్ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, మండలపరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనాథ్గౌడ్, నాయకులు రాకేష్, ఉస్మాన్, కార్తీక్, బాబు పాల్గొన్నారు.