జగన్ బాదుడుతో జనం విలవిల
ABN , First Publish Date - 2022-07-02T06:33:02+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ బాదుడుతో ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తల తాతయ్యబాబు విమర్శించారు.
పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రజల జేబులకు చిల్లు
టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి తాతయ్యబాబు
బుచ్చెయ్యపేట, జూలై 1: ముఖ్యమంత్రి జగన్ బాదుడుతో ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తల తాతయ్యబాబు విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారన్నారు. శుక్రవారం వడ్డాదిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో ఆర్టీసీ చార్జీలు రెండు, విద్యుత్ చార్జీలు ఏడు సార్లు పెంచారన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, ఇసుక, ఇనుము, సిమెంట్, మద్యం ధరలు, రిజిస్ర్టేషన్ చార్జీలు పెంచుకుంటూ పోయిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. డీజిల్ సెస్, టోల్ ఫీజు, సేప్టీ సెస్ తదితర పేరుతో వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను గాలికి వదిలేసిందన్నారు. ఆర్టీసీ భూములు కబ్జాకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్మికుల ఆరోగ్యంపై భరోసా ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతూ రాష్ర్టాన్ని సీఎం జగన్ దివాలా తీసేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి రివర్స్ పాలనకి రోజులు దగ్గర పడ్డాయని, వైసీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని తాతయ్యబాబు తెలిపారు.