వేలిముద్ర లేకుండానే పింఛన్
ABN , First Publish Date - 2020-03-29T10:56:38+05:30 IST
ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతోంది.. మరోవైపు 1వ తేదీ దగ్గరకొస్తోంది.. ఇంకోవైపు లబ్ధిదారులు పింఛను కోసం
ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీ
రూ. 110 కోట్లు సిద్ధం
ఏలూరు మార్చి 28, (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతోంది.. మరోవైపు 1వ తేదీ దగ్గరకొస్తోంది.. ఇంకోవైపు లబ్ధిదారులు పింఛను కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో పింఛన్ల పంపిణీకి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలతో పని లేకుండా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక వర్షెన్ యాప్తో..
జిల్లాలో నాలుగు లక్షల 70 వేల పైచిలుకు లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ బయోమెట్రిక్ ద్వారా ప్రతీ నెల 1వ తేదీన అందజేస్తున్నారు. ఆ మేరకు ఈ నెల 110 కోట్ల రూపాయల పింఛన్ నగదును అధికారులు సిద్ధం చేశారు. కరోనా ప్రభావం ఉన్నందున, జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ లేకుండానే పింఛన్ పంపిణీ చేయనున్నారు. అందుకోసం వైయస్ఆర్ పింఛను కానుక వెర్షన్ 1.2 యాప్ను సిద్ధం చేశామన్నారు. ఈ యాప్లో లబ్ధిదారుల పింఛను కార్డు ఐడీ నెంబరును నమోదు చేస్తారు. వెంటనే యాప్లో లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో వస్తాయి. పింఛను పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులకు నగదు అందిస్తున్న ఫొటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు.