ఆర్టీసీలో పెన్షన్కు మంగళం..!?
ABN , First Publish Date - 2022-04-04T10:25:40+05:30 IST
కొలువు నుంచి విరమణ పొందాక సహజంగానే ఆ ఉద్యోగికి నెలనెలా పెన్షన్ వస్తుంది. ఈ అవకాశం టీఎ్సఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు ఉండకపోవచ్చు! సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో ...
- 26,900 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు షాక్
- పనిచేసే వారికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే..
- ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎందుకన్న ప్రశ్న?
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): కొలువు నుంచి విరమణ పొందాక సహజంగానే ఆ ఉద్యోగికి నెలనెలా పెన్షన్ వస్తుంది. ఈ అవకాశం టీఎ్సఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు ఉండకపోవచ్చు! సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని (స్టాఫ్ రిటైర్డ్ బెనిఫిట్ స్కీం-ఎ్సఆర్బీఎస్) ఎత్తివేయాలని టీఎ్సఆర్టీసీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన నిర్ణయ రూపం దాలిస్తే సుమారు 26,900 మంది ఉద్యోగుల కుటుంబాలు నెల నెలా పెన్షన్ పొందడాన్ని కోల్పోతాయని ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎస్ఆర్బీఎ్సను తొలగిస్తే ఏటా సుమారు రూ.6.5 కోట్లకుపైగా నిధులు మిగిలే అవకాశం ఉందని ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో పాటు వివిధ స్థాయిల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు నెలనెలా వారి వేతనాల నుంచి రూ. 300ల చొప్పున యాజమాన్యం మినహాయించి ఎస్ఆర్బీఎస్ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే 1999లో ఆర్టీసీ యజమాన్యం, నాటి గుర్తింపు పొందిన కార్మిక సంఘం ప్రతినిధులతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏటా సుమారు రూ.6.5 కోట్ల నిధులు ఎస్ఆర్బీఎస్ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని లాభదాయక వడ్డీ ఇచ్చే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా పెన్షన్ కింద ఆర్టీసీ చెల్లిస్తోంది. ప్రస్తుతానికైతే రిటైర్ అయిన ఉద్యోగులకు చెందిన 26,900 కుటుంబాలు ప్రతినెల కనిష్టంగా రూ.150 నుంచి గరిష్టంగా రూ.3,200 వరకు పొందుతున్నారు. ఇందుకు ఆర్టీసీ నెలకు రూ.2.15 కోట్లు వెచ్చిస్తోంది. అయితే పని చేస్తున్న ఉద్యోగులకే నెల నెలా సక్రమంగా వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ అందించి ఆదుకోవలిసిన అవసరం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది.