మృతదేహానికి పింఛన్!
ABN , First Publish Date - 2021-03-02T09:33:16+05:30 IST
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇచ్చిన విచిత్ర పరిస్థితి వెలుగుచూసింది.
విజయనగరం జిల్లాలో సంఘటన
గుర్ల, మార్చి 1: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇచ్చిన విచిత్ర పరిస్థితి వెలుగుచూసింది. గ్రామంలోని ఒకటో వార్డు గొల్లవీధికి చెందిన ఎర్ర నారాయణమ్మ(65) సోమవారం ఉదయం మృతి చెందింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణం విడిచింది. ఒకటో తేదీన పింఛను ఇచ్చేందుకు ఎప్పటిలా ఆమె ఇంటికి ఉదయాన్నే వచ్చిన వలంటీర్ త్రినాథ్ వృద్ధురాలు మృతిచెందడం గమనించాడు. కుటుంబ సభ్యులకు పింఛను డబ్బులు అందజేసి ప్రాణం కోల్పోయిన వృద్ధురాలు నారాయణమ్మ చేతి నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాడు. అంతేకాకుండా మృతదేహంతో ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.