పింఛ న్లకు కోత!
ABN , First Publish Date - 2021-06-23T05:21:34+05:30 IST
పేదలకు అందించే సామాజిక పింఛన్లను రద్దు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మొదటిగా ఒంటరి మహిళ, వితంతు పింఛన్ల ఏరివేతపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
వితంతు, ఒంటరి మహిళల పింఛన్లపై విచారణ
బియ్యం కార్డు డేటా ఆధారంగా నోటీసులు
(కొమరాడ)
పేదలకు అందించే సామాజిక పింఛన్లను రద్దు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మొదటిగా ఒంటరి మహిళ, వితంతు పింఛన్ల ఏరివేతపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొందరు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న వారు తమ అర్హత నిర్ధారించుకుని సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లో తెలియజేయాలని అందులో పేర్కొన్నారు. భర్త చనిపోయినా కొందరు రేషన్ కార్డుల్లో మార్పులు చేయలేదు. భర్త పేరు తొలగించి ఉండకపోతే ఆమె పింఛను రద్దు చేస్తున్నారు. భర్త వదిలి వెళ్లిన కేసుల్లో ఒంటరిగా నివశిస్తున్న మహిళలకు ప్రభుత్వం ఒంటరి మహిళ పింఛన్ మంజూరు చేస్తోంది. వీరు విడాకులు పొందడం లేదా గ్రామ పెద్దల సమక్షంలో విడిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం చేయాలి. లేకుంటే బియ్యం కార్డులో భర్త పేరు ఉండడం చూసి ఆమె పింఛన్ను రద్దు చేస్తున్నారు. రేషన్ కార్డుదారుడు గతంలో ఈకేవైసీ చేయించడంతో భార్యాభర్తలు రేషన్ బియ్యం తీసుకుంటున్నట్లు బయట పడుతోంది. భర్త ఉండి పింఛన్లు పొందుతున్న వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించి వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. బియ్యం కార్డులో మార్పులు చేయకపోవడంతో భర్త ఉన్నట్టే భావించి పింఛను రద్దుకు సిఫారసు చేస్తున్నారు. భర్త ఉండి వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు పొందుతుంటే వారి పింఛను రద్దు చేయడంలో తప్పు లేదని, ఏదో ఒక సాకుతో పింఛను రద్దు చేస్తే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఫిషర్మెన్, ఒంటరి మహిళ, అభయ హస్తం, డీఎంహెచ్వో, డప్పు కళాకారులు, చర్మకారులు, తదితర 16 రకాల పింఛన్లదారులు 3,33,266 మంది ఉన్నారు. వీరిలో 1,23,616 మంది వితంతు, ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. వీరిపై సివిల్ సప్లయ్స్ డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటే వేల పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉందని సంబంధిత శాఖ సిబ్బంది చెబుతున్నారు.
విచారణ జరుగుతోంది
ప్రభుత్వ ఆదేశాల మేరకు వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛన్లపై విచారణ జరుగుతోంది. అర్హత ఉన్నవారు యథావిధిగా పింఛను పొందుతారు. కొంతమందికి భర్త ఉన్నా... పింఛన్లు పొందుతున్నట్లు తెలిసింది. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం.
- ఎం.గోపాలకృష్ణ, ఎంపీడీవో, కొమరాడ