‘కోన’ లాక్.. ఉత్సవం డౌన్!
ABN , First Publish Date - 2021-05-15T05:43:15+05:30 IST
జిల్లాలో తొలి లాక్డౌన్ను అధికారికంగా ప్రకటించారు.
20 నుంచి 31దాకా అన్నీ బంద్!
ప్రత్యేక చెక్పోస్టు.. 3 కి.మీ ముందే నిలిపివేత
ఈసారీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే!
రాపూరు, మే 14: జిల్లాలో తొలి లాక్డౌన్ను అధికారికంగా ప్రకటించారు. పెంచలకోన క్షేత్రంలో 20వ తేదీ నుంచి 12 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 31వ తేదీ ఆలయాలను మూసివేస్తున్నందున క్షేత్రానికి భక్తులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. క్షేత్రానికి భక్తులు రాకుండా మూడు కి.మీ దూరంలోని తెగచెర్ల బ్రాంచి రోడ్డు వద్దే ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికే క్షేత్రంలో రోజుకు నాలుగున్నర గంటలు మాత్రమే శ్రీవార్ల దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగాల్సి వుంది. గతేడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
అమలవుతున్న ఆంక్షలు
పెంచలకోన కోన క్షేత్రంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు మాత్రమే శ్రీవార్ల దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. క్షేత్రంలో గదులను కేటాయించడం లేదు. పలు కుల సత్రాలూ మూతపడ్డాయి. అన్నప్రసాదాన్ని పొట్లాల ద్వారా అందిస్తున్నారు. కల్యాణకట్టలో క్షురకులు పీపీఈ కిట్లు ధరించి భక్తుల తలనీలాలు తీస్తున్నారు. నిత్యం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారిరీ చేస్తున్నారు. ఆలయంలో నిత్యసేవలు ఏకాంతంగా నిర్వహిస్తూ తీర్థం, శఠారిని నిలుపుదల చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో కోనకు భక్తుల తాకిడి కరువైంది.