మీ ప్లీనరీకో దండం
ABN , First Publish Date - 2022-07-01T09:05:48+05:30 IST
మీ ప్లీనరీకో దండం
ఈ అవమానాలు భరించలేను
పలాస-కాశీబుగ్గ మునిసిపల్ చైర్మన్ ఆవేదన
అనుచరులతో సమావేశం నుంచి బయటికి
పలాస, జూన్ 30: ‘మీ ప్లీనరికో దండం’ అంటూ పలాస-కాశీబుగ్గ మునిసిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అనుచరులతో సహా ప్లీనరీ నుంచి బయటికి వెళ్లిపోవడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ మండల నాయకుడు పైల వెంకటరావు (చిట్టి) అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం నుంచే మునిసిపల్ చైర్మన్ గిరిబాబుకు అవమానాలు ఎదురయ్యాయి. ఆయనను వేదికపైకి ఆహ్వానించకుండా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటరావు, జడ్పీ చైర్మన్ పిరియా విజయలను ఆహ్వానించారు. అయినా గిరిబాబు వేదికపైకి వచ్చారు. ఆయన వెంట అనుచరులు కూడా చేరారు. వారందరినీ కిందకు దిగాలని మంత్రి అప్పలరాజు ఆదేశించడంతో అనుచరులతో సహా గిరిబాబు వేదిక దిగిపోయారు. అనంతరం గిరిబాబు మాట్లాడాలని మైక్లో ప్రకటించిన చిట్టి.. గిరిబాబు స్టేజీపైకి చేరుకొని మైకు పట్టుకోగానే ‘మీకు మరోమారు మాట్లాడే అవకాశం ఇస్తాం, ఇప్పుడు సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటరావు మాట్లాడతారు’ అని చెప్పారు. దీంతో రెండోసారి వేదిక నుంచి దించేశారంటూ గిరిబాబు మనస్తాపం చెందారు. ఇప్పటి వరకూ ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు భరించానని, ఇక భరించలేనని చెప్పడంతో ఆయన వెంటే అనుచరులు ప్లీనరీ నుంచి బయటికి నడిచారు.