27 నుంచి పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-06T05:16:34+05:30 IST

ఈనెల 27 నుంచి జనవరి 1వ తేదీ వరకు జరగనున్న అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలను కొవిడ్‌-19 ప్రభుత్వ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా అన్నారు.

27 నుంచి పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా 

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 5 : ఈనెల 27 నుంచి జనవరి 1వ తేదీ వరకు జరగనున్న అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలను కొవిడ్‌-19 ప్రభుత్వ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక అమీన్‌పీర్‌ దర్గాలోని ముషాయిరా హాలులో దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి గౌరవ అతిథిగా అంజద్‌బాషా, ముఖ్య అతిథిగా కలెక్టరు హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన్‌, సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌ తదితర అధికారులు ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అంజద్‌బాషా మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన అమీన్‌పీర్‌ దర్గా ఉత్సవాలను కరోనా నిబంధనల మేరకు అన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించాలన్నారు. కలెక్టరు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామన్నారు. కలెక్టరు హరికిరణ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అధికారులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు. 200 మందికి మించి సమూహం లేకుండా నిర్వహించుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం, శానిటైజేషన్‌, వ్యక్తిగత పారిశుధ్యం పాటించాలన్నారు. ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉరుసు కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మస్తాన్‌వలి, డీఎస్పీ షౌకత్‌ఆలీ పాల్గొన్నారు. సమావేశానంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - 2020-12-06T05:16:34+05:30 IST