రైతు పోరు.. ప్రభుత్వ పతనానికి నాంది

ABN , First Publish Date - 2022-06-25T08:59:55+05:30 IST

రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి బద్వేలు రైతు పోరుబాటే నాంది అని టీడీపీ నేతలు అన్నారు.

రైతు పోరు.. ప్రభుత్వ పతనానికి నాంది

  • వ్యవసాయ మీటర్లు.. రైతులకు ఉరితాళ్లే
  • బద్వేలు రైతు పోరుబాటలో టీడీపీ నేతలు

బద్వేలు, జూన్‌ 24: రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి బద్వేలు రైతు పోరుబాటే నాంది అని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు బిగించే మీటర్లు.. రైతుల పాలిట ఉరితాళ్లు అవుతాయని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలులో మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, టీడీపీ యువనేత రితేశ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బద్వేలులో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోమన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ రైతూ సంతోషంగా లేరన్నారు. 


రైతులే కాదు ఏ వర్గమూ సంతోషంగా లేనివిధంగా పరిపాలన సాగుతోందన్నారు. వైసీపీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులను చైతన్యంచేసి జగన్‌ ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా పోరుబాట సాగించాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రానికి బెదరకుండా విద్యుత్‌ మీటర్లను వ్యతిరేకిస్తే.. జగన్‌ మాత్రం కేంద్రానికి తలొగ్గి విద్యుత్‌ మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం, అప్పుల కోసం  జగన్‌ ఈ దుస్థితికి వచ్చారన్నారు. ప్రతి రైతు మీటర్లను వ్యతిరేకించాలని సూచించారు. సీఎం సొంత జిల్లాలోనే మీటర్లను రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.

Updated Date - 2022-06-25T08:59:55+05:30 IST