నైతికతతోనే శాంతి

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

ఈ లోకంలో గడిపే జీవితంలో సంపదలు, సౌఖ్యాలు, విలాసాలు లభిస్తే ఆనందంగా ఉండవచ్చుననీ

నైతికతతోనే  శాంతి

ఈ లోకంలో గడిపే జీవితంలో సంపదలు, సౌఖ్యాలు, విలాసాలు లభిస్తే ఆనందంగా ఉండవచ్చుననీ, ప్రశాంతంగా గడపవచ్చనీ మనిషి అనుకుంటాడు. కానీ అది అపోహ మాత్రమే. శాంతి దైవారాధనలో లభిస్తుంది, శాంతి నైతికతమీద ఆధారపడి ఉంటుంది. హృదయంలో నైతికత లేని వ్యక్తి జీవితం క్రమపద్ధతిలో నడవదు. అలాంటి వ్యక్తులు ఉన్న సమాజం కూడా సరైన పద్ధతిలో పయనించదు. సత్యంతో కూడిన సమాజం ఏర్పడదు. వాస్తవానికి సమాజం బాగోగులన్నీ ధార్మికతమీదే ఆధారపడి ఉన్నాయి.


కాబట్టి ప్రతి విశ్వాసి నీతిగా, ఆదర్శంగా ఉన్నప్పుడే సమాజం కూడా ఆదర్శంగా ఉంటుంది. ధర్మం పరిఢవిల్లుతుంది. నైతికత లేనప్పుడు సమాజం చీకటిలో మునిగిపోతుంది. మనిషికి సంపద పుష్కలంగా ఉన్నంత మాత్రాన, కార్లు, బంగళాలు ఉన్నంత మాత్రాన మానసిక శాంతి లభించదు. అది దైవారాధన వల్ల మాత్రమే లభిస్తుంది. మానవులు దేవుని ఆదేశాలను ఆనుసరిస్తూ, నైతిక విలువలు పాటిస్తే సమాజం కూడా చక్కగా ఉంటుంది.


‘ప్రాపంచిక వ్యామోహం సర్వ నష్టాలకూ మూలం’ అన్నారు పెద్దలు. మనుషులు తమలోని పాపాలనూ, తప్పులనూ వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే... అన్ని అనర్థాలకూ మూలకారణం తమలోని ప్రాపంచిక వ్యామోహమేనని స్పష్టమవుతుంది. 


‘‘మానవులారా! అల్లాహ్‌ వాగ్దానం నిశ్చయంగా సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసం చెయ్యకుండా చూసుకోండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ హితవు చెప్పింది. ‘‘తీర్పు దినం తప్పకుండా వస్తుంది. అల్లాహ్‌ చేసిన ఆ వాగ్దానం సత్యమైనది. ఆ రోజున ప్రతి ఒక్కరూ వారి కర్మల మీద తీర్పు కోసం దేవుడి ముందు నిలబడాల్సిందే. ఇహలోకంలోని సంపదలను, సౌఖ్యాలనూ, వైభవాలనూ చూసి మోసపోకూడదు. పరలోక జీవితాన్ని మరువకూడదు. సైతాన్‌ వలలో పడి... ప్రాపంచిక సౌఖ్యాలలో మునిగిపోయి, పరలోకాన్ని దూరం చేసుకోవద్దు’’ అన్నది దీని వెనుక అంతరార్థం.

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST