రాజశేఖర్‌ రెడ్డి అసలైన కాంగ్రెస్‌వాది

ABN , First Publish Date - 2020-07-09T12:11:56+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అసలైన కాంగ్రెస్‌ వాది అని, వైఎస్‌ జగన్‌ తండ్రి ఆశయాలను తుంగలో తొక్కారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ..

రాజశేఖర్‌ రెడ్డి అసలైన కాంగ్రెస్‌వాది

ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన జగన్‌

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ తులసిరెడ్డి


కడప(కలెక్టరేట్‌), జూలై 8: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అసలైన కాంగ్రెస్‌ వాది అని, వైఎస్‌ జగన్‌ తండ్రి ఆశయాలను తుంగలో తొక్కారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. కడపలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌ విగ్రహానికి తులసిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ వైఎస్‌కు ఎనలేని గౌరవమిచ్చారన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌పట్ల అంతే విఽధేయంగా ఉండేవారన్నారు. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు, సోనియాకు వెన్నుపోటుదారుడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


యువజన శ్రామిక రైతుపార్టీ పెట్టి, వైఎస్‌ బద్ద శత్రువుగా భావించే బీజేపీకి మిత్ర పక్షంగా మారి  కాంగ్రెస్‌ పథకాలను పేర్లు మార్చి తన పథకాలుగా చూపుకుంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారన్నారు. వైఎస్‌ మరణానికి కారణం రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ అంటూ అప్పుడు ఆరోపించి, నేడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదే అంబానీలకు రాష్ట్రంలో రెడ్‌ కార్పెట్‌ పరిచి రాజ్యసభ సీటు ఇచ్చిన ఘనత జగన్‌దే అన్నారు. ఇలాంటి వింత చేష్టలు చూస్తుంటే వైఎస్‌ ఆశయాలకు తనయుడుగా జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి సొంత ఇంటిలో హత్యకు గురైతే సీఎంగా ఏమి చేశావంటూ మండిపడ్డారు. చిన్నాన్నకు న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు నీలి శ్రీనివాసరావు, నజీర్‌ అహమ్మద్‌, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T12:11:56+05:30 IST