రూ. 500 కోట్ల ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం ప్రారంభించిన పేటీఎం
ABN , First Publish Date - 2020-03-30T22:35:54+05:30 IST
దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. భారీ విరాళాలతో ముందుకొస్తున్నారు. పలు కంపెనీలు కూడా ప్రభుత్వానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాజాగా, ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ పేటీఎం కూడా కరోనాపై పోరులో భాగస్వామ్యమైంది. పీఎం కేర్స్ ఫండ్కి సామాన్యులు సైతం విరాళం అందించేలా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 500 కోట్లను సమీకరించి సహాయనిధికి అందించనుంది.
ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా పేటీఎం యాప్ నుంచి కానీ, వెబ్సైట్ నుంచి కానీ ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా, లేదంటే డొనేషన్ చేసినా ఆ మొత్తానికి పది రూపాయలు కలిపి పీఎం కేర్స్ ఫండ్కు అందేలా ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసింది. పేటీఎం చేపట్టిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోందని పేటీఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.