పేటీఎం ఐపీఓకు సెబీ ఓకే!

ABN , First Publish Date - 2021-10-23T08:08:40+05:30 IST

డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పేటీఎం ఐపీఓకు సెబీ ఓకే!

రూ.16,600 కోట్లు సమీకరించనున్న కంపెనీ 

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐపీఓ ద్వారా రూ.16,600 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలాఖరు నాటికి పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. త్వరితగతిన లిస్టింగ్‌ కోసం కంపెనీ ప్రీ-ఐపీఓ షేర్ల విక్రయం లేకుండా నేరుగా ఐపీఓకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1.47-1.78 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను ఆశిస్తోంది. కంపెనీల మార్కె ట్‌ విలువ మదింపు నిపుణులు, న్యూయార్క్‌ యూనివర్సిటీలోని స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ అశ్వత్‌ దామోదరన్‌ పేటీఎం అన్‌లిస్టెడ్‌ షేరు విలువను రూ.2,950గా లెక్కగట్టారు.  


28 నుంచి నైకా ఐపీఓ:

సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తుల విక్రయ పోర్టల్‌ నైకా నిర్వహణ సంస్థ ఎఫ్‌ఎ్‌సఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈనెల 28న ప్రారంభమై వచ్చే నెల 1న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.1,085-1,125గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.630 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 4,19,72,660 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. ధర శ్రేణిలోని గరిష్ఠ స్థాయి ప్రకారం.. కంపెనీ రూ.5,352 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉంది. 


సెన్సెక్స్‌ మరో 102 పాయింట్లు డౌన్‌ :

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. శుక్రవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 101.88 పాయింట్లు కోల్పోయి 60,821.62 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 63.20 పాయింట్ల నష్టంతో 18,114.90 వద్ద స్థిరపడింది. 

Updated Date - 2021-10-23T08:08:40+05:30 IST