నష్టపరిహారం చెల్లించండి
ABN , First Publish Date - 2022-07-01T05:16:18+05:30 IST
కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు నిరసన స్వరం పెంచారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఇంజనీరింగ్ కళాశాల నిర్వాసితుల డిమాండ్
వరి సాగుకు సమాయత్తం
ఆరుగురి అరెస్ట్
సాయంత్రానికి విడుదల చేసిన పోలీసులు
నేడు కలెక్టర్తో చర్చలు
కురుపాం,జూన్30: కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు నిరసన స్వరం పెంచారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వారం రోజులుగా పనులు అడ్డుకుంటున్న వారు తాజాగా కళాశాల నిర్మాణ ప్రాంతంలో వరిసాగుకు సమాయత్తమయ్యారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి, స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆరుగురు నిర్వాసితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, టీడీపీ నాయకురాలు శత్రుచర్ల పల్లవి రాజు, మిగిలిన నిర్వాసితులు పోలీసులను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో డీఎస్పీ శ్రావణి, కురుపాం తహసీల్దార్ ఉమామహేశ్వరరావు నిర్వాసితులతో మాట్లాడారు. శుక్రవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో చర్చలు జరిపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సాయంత్రానికి ఆరుగురు నిర్వాసితులను విడుదల చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.