పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-05-25T05:18:35+05:30 IST
ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసి నెలలు గడుస్తున్న బిల్లులు రావడం లేదని, పూర్తయిన పనులకు వెంటానే బిల్లులు చెల్లించాలని సర్పంచ్లు రాజు, మోహన్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఝరాసంగం మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల పనితీరుపై సభ్యుల ఆగ్రహం
ఝరాసంగం, మే 24: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసి నెలలు గడుస్తున్న బిల్లులు రావడం లేదని, పూర్తయిన పనులకు వెంటానే బిల్లులు చెల్లించాలని సర్పంచ్లు రాజు, మోహన్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం ఝరాసంగం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కె.దేవిదాస్ అధ్యక్షతన జరిగింది. పూర్తి చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు రాలేదని, మళ్లీ పనులు చేపట్టాలంటే తమ ఆస్తులు అమ్ముకుని పనులు చేపట్టాలని సర్పంచులు అధికారులను ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని వాటిని వెంటనే మరమ్మతు చేయాలని జీర్లపల్లి సర్పంచ్ రాంరెడ్డి సంబంధిత అధికారికి తెలియజేశారు. మండలంలో వివిధ గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం కింద పనులు చేపట్టినప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని పోట్పల్లి సర్పంచ్ ధన్రాజ్ పాటిల్, క్రిష్ణాపూర్ సర్పంచ్ అమర్జిత్ సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో సర్పంచ్లు, ఎంపీటీసీలు వారి పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గైర్హాజరైతే తమ సమస్యలను ఎవ్వరికీ విన్నవించుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ తారసింగ్, ఎంపీడీవో సుజాత, ఏపీవో రాజ్ కుమార్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.