దొంగా’ట’
ABN , First Publish Date - 2022-05-17T06:03:20+05:30 IST
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు పేరిట శాప్ ప్రవేశపెట్టిన ఫీజులు రాష్ట్రంలో క్రీడల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది.
వేసవి క్రీడా శిభిరాల పేరుతో భారీ దోపిడి
వేలల్లో ప్రవేశ రుసుం, నెలవారీ ఫీజులు అధనం
ఆటలకు దూరమవుతున్న పేద క్రీడాకారులు
సొమ్ము ఉంటేనే ఆటలు అంటున్న అధికారులు
పన్నుల వాత. దాతలు ఇచ్చిన నిధులుపై లెక్క చెప్పని వైనం
ప్రతి క్రీడలో 100 మందిని చేర్పించాలంటూ కోచ్లపై ఒత్తిడి
క్రీడాభివృద్ధికి పెట్ట పీట వేస్తామన్న ప్రభుత్వం, వాటి మీద ఫీజులు భారీగా పెంచడాన్ని, క్రీడాకారులు, క్రీడాభిమానులు వ్యతిరేకిస్తున్నారు. వేసవిలో తమ పిల్లలను క్రీడలకు పంపాలంటేనే భయపడేంతగా ఫీజులు పెంచడంపై తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. తొలుత పే అండ్ ప్లే విధానం తీసుకువచ్చి కొద్ది పాటి వసూళ్లుతో ప్రారంభించిన శాప్, వేసవి శిక్షణ శిబిరాల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. కొవిడ్ దెబ్బకి ఆర్ధికంగా బాధపడుతున్న పేద క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు నూతన ఫీజులు భారంగా మారాయి. ముఖ్యంగా ప్రస్త్తుతం ఫీజుల దెబ్బకి పేద క్రీడాకారులు ఆటలకు దూరమవ్వాల్సిన పరిస్ధితి. అధికారులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సొమ్ము ఉంటేనే ఆటలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
గుంటూరు(తూర్పు), మే 16: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు పేరిట శాప్ ప్రవేశపెట్టిన ఫీజులు రాష్ట్రంలో క్రీడల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. గతంలో క్రీడా విధానాలు రూపొందించే సమయంలో, స్పోర్ట్స్ బీట్స్ వేసే సమయంలో, ఇతర ముఖ్యవిషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినపుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో, నైపుణ్యం కల్గిన కోచ్లతో సమావేశమై వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని శాప్ ఒక నిర్ణయానికి వచ్చేది. కానీ ప్రస్తుతం పెంచిన ఫీజులు ఎవరితో చర్చించకుండా శాప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఫీజులను జిల్లాల వారీగా విభజించి వాటిని నేరుగా శాప్ ఖాతాలోకి జమ అయ్యేలా జీవో జారీ చేసింది. కానీ ఈ డబ్బులను మాత్రం క్రీడల ప్రోత్సాహానికి ఉపయోగించడం లేదు. కనీసం శాప్లీగ్స్ ఆడిన వారికి భోజన, వసతి సదుపాయాలు గానీ ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఇంతా కష్టపడిన తరువాత శాప్ లీగ్ జారీ చేసిన సర్టిఫికెట్లు కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్ 2శాతం కింద కూడా పరిగణనలోకి తీసుకోరు. అసలు ఈ సర్టిఫికెట్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు, తల్లిదండ్రులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి తమ జేబులు నింపుకోవడానికి వేసవి శిబిరాలు ప్రారంభించారని అంతే తప్ప వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోచ్లపై ఒత్తిడి....
క్రీడాకారుల పరిస్ధితి ఇలా ఉంటే ఆటలు నేర్పే కోచ్ల పరిస్ధితి మరోలా ఉంది. వేసవి క్రీడల పేరిట శాప్ మొత్తం 44 క్రీడాంశాల్లో శిక్షణలు నిర్వహిస్తున్నటు ప్రకటించింది. తల్లిదండ్రుల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఒక్కో క్రీడాంశంలో కనీసం 100 మందిని అయినా చేర్పించాలని అయా కోచ్లకు లక్ష్యాలను నిర్ధేశించింది. మీరే ప్రైవేటు పాఠశాలల వద్దకు వెళ్లి పిల్లలను శిబిరాల్లో పాల్గొనేలా ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. శిబిరంలోకి చేరగానే రూ 100 ను కనీస రుసుంగా వసూలు చేస్తారు. ఇలా ఒక్కో అంశంలో 100 మంది దగ్గర పదివేలు, మొత్తంగా దాదాపు రూ.5 లక్షలు వసూలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆ తరువాత జిల్లా ఎంపికలు, రాష్ట్ర ఎంపికలు పేరుతో ఒకో క్రీ డాకారుని నుంచి రూ 200 వసూలు చేయాలి. ఆ టుపై కట్టే ప్రవేశ
రుసుములు, నెలవారీ ఫీజులు షరా మాములే...
శాప్ విడుదల చేసిన ఫీజుల వివరాలు:
ప్రవేశ రుసుం నెలవారీ ఫీజులు
సాధారణ క్రీడాకారులకు రూ 3,000 రూ 2000
తెల్ల రేషన్ కుటుంబాలకు రూ 1,000 రూ 500
టీడీపీ హయాంలో ప్రోత్సాహకాలు.....
పిల్లలను. ప్రతిభ కలిగిన క్రీడాకారులను క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. అప్పటి శాప్ అధికారులు పెద్ద పిల్లలకు అకాడమీలు, 8-15 సంవత్సలరాల పిల్లలకు డే బోర్డింగ్ స్కీములు, చిన్నపిల్లలకు నర ్సరీ పంటి పఽథకాలను ప్రవేశపెట్టింది. అంతేగాక అసోసియేషన్లు, స్పాన్సర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి క్రీడాకారులకు స్కాలర్షిప్లు, పేద పిల్లలకు డైట్ నిమిత్తం ప్రతి నెల రూ.2 వేలు చొప్పున అందించేది. వీటితో పాటు స్పోర్ట్స్ కిట్లను, క్రీడాకారులకు ట్రాక్ సూట్లను, క్రీడాభివృద్ధికి కావాల్సిన ఇతర మెటీరియల్ను అందించేవారు. ఈ విధానం దాదాపు 2020 వరకు కొనసాగింది. ప్రస్తుతం శాప్లీగ్ ఏర్పడిన తరువాత ప్రోత్సాహకాలు పోయి వారి దగ్గర నుంచే ఫీజుల వసూలు చేసే దురాచారాన్ని తీసుకువచ్చింది.
ఆ నిధులు ఏమైనట్లు..
జిల్లాలో జరిగే మైనింగ్, తవ్వకాలకు సంబంధించి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో క్రీడాభివృద్ధికి 2శాతం కేటాయిస్తారు. వీటితో పాటు ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో క్రీడలకు కొంత మేర నిధులు కేటాయిస్తారు. ఇవే గాకుండా స్టేడియాలు, క్రీడల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తూంటారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన పే అండే ప్లే ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కలిపి అన్ని శాప్ దగ్గరకే చేరతాయి. ఇన్ని నిధులు ఉంచుకుని ఇప్పుడు మళ్లీ శిభిరాల పేరిట డబ్బులు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ నిధులు ఎమయ్యాయో చెప్పాలని క్రీడాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
3 నెలల్లోనే భారీగా పెంపు.....
పే అండ్ ప్లే విధానం తీసుకువచ్చి మూడు నెలల కాకముందే వేసవి శిభిరాల పేరిట ఫీజులను భారీగా పెంచుతున్నట్టుగా శాప్ లీగ్ జీవో జారీ చేసింది. పైగా అవి తమకోసం కాదని స్టేడియాల్లో మౌలిక వసతులు, విద్యుత్, వాటర్ ఛార్జీలు, ఇండోర్ స్టేడియాలు శుభ్రతకు అంటూ పేర్కొంది. పగలు పూట మైదానాల్లో ఆడుకునే క్రీడలకు కూడా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం ఏంటో శాప్ అధికారులే సమాధానం చెప్పాలి.
పెంచిన ప్రవేశ రుసుం వివరాలు.....
3నెలల క్రితం ప్రస్తుతం
అండర్-14 - 14 ఏళ్లపైనా అండర్-14 - 14 ఏళ్లపైనా
బ్యాడ్మింటన్ 250/- 500/- 1000/- 2000/-
క్రికెట్ 250/- 400/- 1000/- 2000/-
స్కేటింగ్ 100/- 200/- 1000/- 2000/-
స్విమ్మింగ్ 250/- 500/- 1000/- 2000/-
టేబుల్ టెన్నీస్ 100/- 150/- 1000/- 2000/-
టెన్నీస్ 800/- 1000/- 1000/- 2000/-
యోగా 40/- 50/- 1000/- 2000/-
వీటితో పాటు నెలవారీ ఫీజులను కూడా రెట్టింపు చేస్తూ జీవోలను జారీచేశారు.