నారాయణరావుపై దాడి దారుణం: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2020-07-14T23:02:59+05:30 IST
విజయనగరం బీజేపీ నాయకుడు కాళ్ళ నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో ..
అమరావతి: విజయనగరం బీజేపీ నాయకుడు కాళ్ళ నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో దాడి చేయడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయిస్తుంటే వాలంటీర్ల ద్వారా వైసీపీ నాయకులు అడ్డుకున్నట్లు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. నారాయణరావుతో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడటం అధికార పార్టీ దౌర్జన్య పూరిత ధోరణిని తెలియచేస్తోందన్నారు.
ఈ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వల్లే హత్యాయత్నానికి ఒడిగట్టారని పవన్ మండిపడ్డారు. తక్షణమే ఘటనపై డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ సూచించారు. వైసీపీ వాళ్లు ఎలాగూ చేయడం లేదని... స్వచ్ఛందంగా పారిశుద్ధ్య నిర్వహణ చేసిన వారిపై అధికార పార్టీ గూండాలు కత్తులతో దాడులకు తెగబడటం ఏ నైజాన్ని వెల్లడిస్తుందో ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని పవన్ సూచించారు.