2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2022-03-15T01:23:37+05:30 IST
2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో..
అమరావతి: 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చని.. వ్యక్తిగత ద్వేషాలొద్దన్నారు. వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలని, ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని పవన్ చెప్పారు.
‘‘వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు. వైసీపీ కార్యకర్తల్ని ఆలోచించాలి. ఒక్క ఛాన్సని ఏపీని జగన్ నిండాముంచేశాడు. 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీయే. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు?. మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేనే. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతే. ’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.