బూతులు తిడితే తొక్కిపట్టి నార తీస్తా.. ఇక నుంచి ఊరుకునేది లేదు : Pawan
ABN , First Publish Date - 2021-10-02T20:44:48+05:30 IST
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్తో మొదలైన మాటల యుద్ధానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు...
కాకినాడ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్తో మొదలైన మాటల యుద్ధానికి ఇంకా ఫుల్ స్టాప్ పడనేలేదు. పవన్ మాట్లాడటం.. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు, కీలక నేతలు, సినీ ప్రముఖులు కౌంటర్లు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇదో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో ‘శ్రమదానం’ కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టడం.. ఆ కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ పవన్ కల్యాణ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. సభా ప్రాంగాణానికి వెళ్లి స్పీచ్ ఇచ్చేంత వరకూ అడగడుగునా టెన్షన్.. టెన్షనే.
తొక్కిపట్టి నార తీస్తా...!
‘యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే వ్యక్తిని కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదు. బూతులు తిడితే తొక్కిపట్టి నార తీస్తా, ఇక నుంచి ఊరుకునేది లేదు. ధవళేశ్వరం వంతెన అంటే రోడ్డు వేశారు. పుట్టపర్తి అంటే అక్కడ కూడా రోడ్డు వేశారు. నా సహనాన్ని ఇక పరీక్షించొద్దు. కనీసం రెండు దశాబ్దాలు నాతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి. నేను తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టలేనని బెట్టింగ్లు కట్టారు. నాపై నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇవి మెతక లీడర్లు ఉన్న రోజులు కావు. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసింది. అందుకే రోడ్లు లేవు, జీతాలు-పెన్షన్లు రావు. నేను బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే వాడిని కాదు.. గుండెల్లో పెట్టుకుంటాను. కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదు. నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదు’ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
భయపడను.. ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..
వర్షంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్లు, వార్నింగ్లు ఇచ్చారు. మరీ ముఖ్యంగా పవన్ను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.