అదే జరిగితే బీజేపీతో ఉండను..: పవన్
ABN , First Publish Date - 2020-02-16T00:12:27+05:30 IST
అదే జరిగితే బీజేపీతో ఉండను..: పవన్
అమరావతి : ఎన్డీఏలోకి వైసీపీ చేరుతోందని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ చేరిక అనంతరం వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా కేంద్రం ఇస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఢిల్లీ పర్యటనలో జగన్ బిజిబిజీగా ఉండటం వరుసగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
అదే జరిగితే...!
ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ-బీజేపీకి ఎటువంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను తప్పుగా అనుకోవద్దని ఈ సందర్భంగా రాజధాని రైతులకు, జనసేన కార్యకర్తలకు పవన్ తెలియజేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను నమ్మడం లేదన్నారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పేశారు. ‘బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పు లేదు..కానీ అందులో జనసేన ఉండదు. అమరావతి కోసం షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అమరావతిలోనే రాజధాని ఉంటుందని మోదీ, అమిత్ షా చెప్పలేదు. పార్టీ పరంగా మాత్రమే నిర్ణయం ప్రకటించారు’ అని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.