టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది : పవన్
ABN , First Publish Date - 2020-02-16T22:08:48+05:30 IST
గత ఎన్నికల్లో టీడీపీకి ఏ గతి పట్టిందో.. వైసీపీకి కూడా అదే గతి పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు.
విజయవాడ: గత ఎన్నికల్లో టీడీపీకి ఏ గతి పట్టిందో.. వైసీపీకి కూడా అదే గతి పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పనిచేసిందన్నారు. ఓడినవాళ్లు ఓపెన్గా ఏడిస్తే.. గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓట్లేసినవాళ్ల పనులు కూడా జరగడం లేదని పవన్ విమర్శలు గుప్పించారు. పనులు జరగడం లేదేంటని ప్రశ్నిస్తే.. డబ్బులు తీసుకోలేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారంట! అంటూ తనతో ఓ ఓటరు అన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా టీడీపీకి ఓటమి తప్పలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని పవన్ పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు. జనసేనకు మీడియా లేకపోయినా సోషల్ మీడియా ఉందని అన్నారు.