కోటి రూపాయల చెక్‌తో ఢిల్లీకి పవన్.. కీలక ఉపన్యాసం!

ABN , First Publish Date - 2020-02-19T22:29:15+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు.

కోటి రూపాయల చెక్‌తో ఢిల్లీకి పవన్.. కీలక ఉపన్యాసం!

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన విషయాలను జనసేన అధికారికంగా ప్రకటించింది. రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి గురువారం నాడు జనసేనాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు అందచేస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి విదితమే.


కీలక ఉపన్యాసం!

మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొననున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జనసేనాని కీలక ఉపన్యాసం చేయనున్నారు. విద్యార్థుల  సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ రూపొందించిన షార్ట్ ఫిలింను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి మేఘాలయ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహించనుండగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.

Updated Date - 2020-02-19T22:29:15+05:30 IST