నాటి త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో రావాలి: పవన్

ABN , First Publish Date - 2021-08-15T16:57:29+05:30 IST

మంగళగిరి జనసేన కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘరంగా జరిగాయి.

నాటి త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో రావాలి: పవన్

అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘరంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో రావాలని ఆకాంక్షించారు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే విధానం, ఓట్లు అమ్ముకునే విధానం మారాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సీఎం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. మన దేశం, రాష్ట్రం కోసం పోరాడే మహనీయులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.


జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలకు జాతీయ నాయకుల పేర్లే పెడతామని పవన్ ప్రకటించారు. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందన్నారు. కానీ మన‌దేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని ఆరోపించారు. కౌన్సిలర్ నుంచి కార్పొరేట్ శక్తుల వరకు అందరకీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని, ఈ విధానం మారితేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ మార్పునకు నేటి తరం నాందీ కావాలనేదే తన ఆకాంక్ష అని పవన్ వ్యాఖ్యానించారు.


రాజకీయ నాయకులంటే పేకాట క్లబ్‌లు ‌నడిపేవారు కాదని. సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టే వారు నాయకులు కాదని, కొత్తతరం నాయకులు, కొత్త రాజకీయం రావాలని పవన్ ఆకాంక్షించారు. తప్పు చేస్తే.. శిక్ష తప్పదు అనే భయం ఉండాలన్నారు. ఓటు‌వేసే ముందు సామాజిక ప్రయోజనాలా..వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచించాలని సూచించారు. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-15T16:57:29+05:30 IST