పవన్‌ రాజకీయం రాష్ట్ర ప్రజలకు రుచించడంలేదు : మంత్రి రాజా

ABN , First Publish Date - 2022-08-17T06:54:39+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయం రాష్ట్రం లో ప్రజలకు రుచించడంలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.

పవన్‌ రాజకీయం రాష్ట్ర ప్రజలకు రుచించడంలేదు : మంత్రి రాజా

తుని, ఆగస్టు 16: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయం రాష్ట్రం లో ప్రజలకు రుచించడంలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయనకు కొమ్ముకాయడానికే జనసేన పార్టీ స్థాపించారన్నారు. పవన్‌ చేస్తున్న విన్యాసాలు ప్రజాభిస్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. జగన్‌పై ద్వేషం, అసూయతో పవన్‌ రగిలిపోయి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారన్నారు. కులాల మధ్య కుమ్ములాట పెట్టేందుకే హైదరాబాద్‌ నుంచి అప్పడప్పుడు ఏపీకి వస్తారని రాజా అన్నారు. కాపుల్లో కొంతమందిని యువకులను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఓట్లు చీలకుండా షణ్ముఖ వ్యూహం పన్నుతానని చెప్పి, చంద్రబాబు వ్యూహాన్ని అమలుచేసేందుకు పవన్‌ సిద్ధంగా ఉన్నారని రాజా విమర్శించారు.



Updated Date - 2022-08-17T06:54:39+05:30 IST