పత్తి రైతుల కష్టాలు

ABN , First Publish Date - 2020-11-29T05:15:24+05:30 IST

పత్తి రైతుల కష్టాలు

పత్తి రైతుల కష్టాలు
నందివనపర్తిలో పొలం వద్ద ఆరబోసిన పత్తి

  • భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు
  • తగ్గిన దిగుబడి.. పెరిగిన అప్పులు  
  • కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు.. ఆందోళనలో రైతులు

యాచారం :  ఈ ఏడాది పత్తి విస్తారంగా వేసిన రైతులకు  అప్పులకుప్ప మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధా నం తీసుకురావడంతో రైతులుమొక్కజొన్నకు బదులుగా ఈ ఏడాది పత్తిని అధికంగా సాగుచేశారు. భారీ వర్షాల కారణంగా పత్తిపంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.  మండలంలోని 24 పంచాయతీల్లో 6,850ఎకరాల్లో పత్తిని  సాగు చేశారు. వివిధ గ్రామాల్లో 185 ఎకరాల్లో పత్తిపంట నీటమునిగి పాడైపోయింది.  పత్తిపంటతో బాగా లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా  మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల పత్తిపంట చేతికందిందని  రైతులు వాపోతున్నారు. పంటలకు సోకిన చీడపీడల నివారణకు పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక రైతులు కుదేలవుతున్నారు.  పొలంలో పదిమార్లు పత్తి తీస్తేనే మంచి లాభాలు వస్తాయి. కాగా ఈసారి ఎకరం పొలంలో ఒకటి రెండు మార్లు పత్తితీయడంతో పొలమంతా బీడుగామారింది. పత్తి మొక్కలు కూడా ఎండిపోతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పత్తి ఎంత నాణ్యతగా ఉన్నా మార్కెట్లో రూ.4,900లకు మించి చిల్లిగవ్వ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం చాలా దూరం ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు. రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి కష్టం మీద పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే పత్తి నాణ్యతగా లేదని కొనుగోలుకు అధికారులు ఆసక్తి చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పత్తితీత కోసం కూలీల కొరత ఏర్పడిందని,  అప్పు చేసి అధికంగా కూలి చెల్లించామని రైతులు తెలిపారు. 


కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు..


 హయత్‌నగర్‌ మండలంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం అధికారులు పత్తి కొనుగోలుకు అనేక కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పత్తి నల్లబడిందని, కాయలా ఉందని ఇటు దళారీలు, అటు సీసీఐ అధికారులు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని మేడిపల్లి, తాడిపర్తి, నానక్‌నగర్‌, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కీజ్‌గూడ తదితర గ్రామాల్లోని రైతులు మండిపడతున్నారు. ఎకరా పత్తిపంటకు దాదాపు రూ.25వేలకు పైగా వెచ్చించామని, వర్షాలకు పంట దెబ్బతిని పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2020-11-29T05:15:24+05:30 IST