మదురై ప్రభుత్వాస్పత్రిలో రోగి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-06-09T15:23:57+05:30 IST
మదురైలోని రాజాజీ జిల్లా కేంద్ర ప్రభుతాస్పత్రిలో ఓ వార్డులో చికిత్స పొందుతున్న రోగిని
చెన్నై : మదురైలోని రాజాజీ జిల్లా కేంద్ర ప్రభుతాస్పత్రిలో ఓ వార్డులో చికిత్స పొందుతున్న రోగిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. సోమవారం వేకువజాము జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. మదురై కరుం బాలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి ఈ నెల ఐదో తేదీ రోడ్డు ప్రమాదంలో గాయపడి రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర చికిత్సా వార్డులో చికిత్స పొందుతున్నాడు. సోమవారం వేకువజామున మురుగన్ దగ్గర ఉన్న అతడి భార్య టీ తేవడానికి ఆస్పత్రి బయటకు వెళ్ళింది.
ఆ సమయంలో గుర్తు తెలియని నలుగురు దుండగులు మురుగన్ ఉన్న వార్డులో చొరబడి వేట కొడవళ్లతో మురుగన్పై దాడి జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మురుగన్ను వైద్యులు వెంటనే ఐసీయూకు తీసుకెళ్ళి చికిత్స అందించినప్పటికీ మురుగన్ మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మురుగన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. ఆ ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలలో నమోదైన వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మురుగన్కు పలు హత్యకేసులతో సంబంధం ఉన్నట్టు తెలిసింది.