విమానం టేకాఫ్ కావడానికి ముందు.. హడలెత్తించిన ప్రయాణికుడు!

ABN , First Publish Date - 2021-03-06T00:25:00+05:30 IST

విమానం టేకాఫ్ కావడానికి కొన్ని క్షణాల ముందు తాను కరోనా బాధితుడినంటూ ఓ ప్రయాణికుడు చెప్పడంతో సిబ్బంది

విమానం టేకాఫ్ కావడానికి ముందు.. హడలెత్తించిన ప్రయాణికుడు!

న్యూఢిల్లీ: విమానం టేకాఫ్ కావడానికి కొన్ని క్షణాల ముందు తాను కరోనా బాధితుడినంటూ ఓ ప్రయాణికుడు చెప్పడంతో సిబ్బంది, ఇతర ప్రయాణికులకు వణికిపోయారు. ఫలితంగా టేకాఫ్ కావాల్సిన విమానం తిరిగి పార్కింగ్‌ బే వద్దకు చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇండిగో విమానం 6ఈ-286 పూణె బయలుదేరడానికి సిద్ధమైంది. టేకాఫ్ కోసం రన్‌వేపైకి చేరుకుంది. కొన్ని క్షణాలు ఆగితే విమానం గాల్లో ఉండేదే.


అంతలో ఓ ప్రయాణికుడు లేచి తాను కరోనా బాధితుడినని, తనకు వైరస్ సోకిందని విమాన సిబ్బందికి చెప్పాడు. అంతేకాదు, తనకు మహమ్మారి సోకినట్టు ధ్రువీకరించే పత్రాలు కూడా వారికి చూపించాడు. అతడు చెప్పింది విన్న ప్రయాణికులు భయంతో హడలిపోయారు. కేబిన్ క్రూ ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో మాట్లాడి పరిస్థితి వివరించాడు. వారి అనుమతితో విమానాన్ని తిరిగి పార్కింగ్ బే వద్దకు తీసుకెళ్లి నిలిపివేశాడు. అనంతరం ఓ ప్రకటన చేశాడు. 6 నుంచి 8 వరుసల సీట్లలో కూర్చున్న ప్రయాణికులు తొలుత విమానం దిగాలని, ఆపై కంటైన్‌మెంట్ కోచ్ వచ్చే వరకు వేచి చూడాలని కోరాడు. కరోనా బాధితుడు ఇందులోనే ఓ వరుసలో కూర్చున్నాడు.  


అనంతరం సీట్లను సిబ్బంది క్రిమిరహితం చేశారు. సీటు కవర్లను మార్చారు. ఆ తర్వాత ప్రయాణికులందరికీ పీపీఈ కిట్లు ఇచ్చారు. విమానం పూణెలో ల్యాండ్ అయేంత వరకు వాటిని ధరించే ఉండాలని కోరారు. అనంతరం విమానం టేకాఫ్ అయింది. విమానం నుంచి దిగిన కరోనా బాధితుడిని దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-06T00:25:00+05:30 IST