భారత విమాన సర్వీసులపై ఎమిరేట్స్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-07-13T22:19:05+05:30 IST

భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమాన సర్వీసులపై దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

భారత విమాన సర్వీసులపై ఎమిరేట్స్ కీలక ప్రకటన!

అబుధాబి: భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమాన సర్వీసులపై దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జూలై 21 వరకు ఈ నాలుగు దేశాల నుంచి విమాన రాకపోకలపై నిషేధం కొనసాగే అవకాశం ఉందని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. యూఏఈ ప్రభుత్వం సూచన మేరకు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి దుబాయ్‌కు ప్రయాణికులను తీసుకువచ్చేది లేదని తెలిపింది. అలాగే 14 రోజుల ముందు ఈ నాలుగు దేశాలకు కనెక్ట్ అయిన ప్రయాణికులకు సైతం యూఏఈలో ప్రవేశానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది.


కాగా, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నట్లు ఎమిరేట్స్ పేర్కొంది. ఇదిలాఉంటే.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత విమానాలపై యూఏఈ ఏప్రిల్ 24 నుంచి నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే మే 13 నుంచి భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ప్రయాణికులను తమ దేశంలోకి ప్రవేశించకుండా బ్యాన్ చేసింది. 

Updated Date - 2021-07-13T22:19:05+05:30 IST