మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదం: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-12-12T23:42:54+05:30 IST

మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్..

మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1971  భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని పేర్కొన్నారు. 1971లో భారత్ విజయం,ఇండో-బంగ్లాదేశ్ మధ్య మైత్రీ సంబంధాలు 50వ పడిలో పడిన సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఆదివార జరిగిన 'సర్ణిమ్ విజయ్ పర్వ్'‌లో రాజ్‌నాథ్ పాల్గొని, ప్రసంగించారు. ఇండో-పాక్ యుద్ధం భారత సాయుధ బలగాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని చాటిందని, ఆ దేశగానే తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.


''మతం ప్రాతిపదికతో విభజన జరగడం వల్ల ఒకే మతం ప్రాతిపదికన పాకిస్థాన్ పుట్టింది. 1971 ఓటమి తర్వాత, మన పొరుగుదేశం (పాక్) నిరంతరం ఇండియాతో పరోక్ష యుద్ధం సాగిస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని, ఇండియా వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని విడగొట్టాలని పాక్ కోరుకుంటోంది. 1971లో పాక్ పన్నాగాలను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఉగ్రవాద మూలాలను తుదముట్టించేందుకు మన సాహస సాయుధ బలగాలకు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రత్యక్ష యుద్ధంలో గెలిచిన మనం పరోక్ష యుద్ధంలో కూడా గెలుస్తాం'' అని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.


1971లో భారత్ విజయం చరిత్రనే కాకుండా, దక్షిణ ఆసియా భౌగోళిక స్వరూపంలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. సత్యం, న్యాయం వైపే ఇండియా ఎప్పుడూ నిలబడుతుందని, యుద్ధం పాకిస్థాన్‌ సైన్యంతో మాత్రమే కాదని, అన్యాయం, చిత్రహింసలపైనని అన్నారు. పాకిస్థాన్‌తో విజయం భారత్ విజయం మాత్రమే కాదని, అన్యాయంపై న్యాయం, చెడుపై ధర్మం సాధించిన విజయమని రాజ్‌నాథ్ అభివర్ణించారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దానిపై భారత్ ఆధిపత్యం చెలాయించాలని అనుకోలేదని, అక్కడి రాజకీయ శక్తులకు అధికారం అప్పగించిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పాదుకొలపడంలో భారత్ ఎంతో కృషి చేసిందన్నారు. బంగ్లాదేశ్ గత 50 ఏళ్లలో అభివృద్ధి దిశగా శీఘ్ర పురోగతి సాధిస్తుండటం సంతోషంగా ఉందని, ప్రపంచదేశాలకు కూడా ఇది స్ఫూర్తి అని అన్నారు.


భారతదేశం ఎన్నడూ ఆక్రమణల కోసం ఇతర దేశాలపై దాడులు చేయలేదనని ఆయన పునరుద్ఘాటించారు. 1971 యుద్ధంలో విజయం కోసం ప్రాణాలర్పించిన మన సైనికులందరికీ శిరసు వంచి అభివందనం చేస్తున్నారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతితో దేశం ఒక వీర సైనికునికి, సమర్ధవంతమైన సలహాదారును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. 1971 యుద్ధం 50వ వార్షికోత్సవంలో ఆయన లేకపోవడం ఎంతో విచారకరమని అన్నారు. అయితే, వార్షికోత్సవానికి ముందే సాయుధ బలగాలను అభినందిస్తూ జనరల్ రావత్ ముందుగానే రికార్డు చేసిన సందేశాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా అందరితో పంచుకున్నారు.

Updated Date - 2021-12-12T23:42:54+05:30 IST