Bengal SSC Scam: పార్థా ఛటర్జీ వ్యవహారంలో మమతా బెనర్జీకి షాకిచ్చిన టీఎంసీ ప్రధాన కార్యదర్శి

ABN , First Publish Date - 2022-07-28T17:05:18+05:30 IST

పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీని ఈడీ అరెస్ట్ చేయడంతో..

Bengal SSC Scam: పార్థా ఛటర్జీ వ్యవహారంలో మమతా బెనర్జీకి షాకిచ్చిన టీఎంసీ ప్రధాన కార్యదర్శి

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీని (Partha Chatterjee) ఈడీ (ED) అరెస్ట్ చేయడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్షమే కాదు స్వపక్షంలో కూడా ఆ డిమాండ్ తెరపైకి రావడం కొసమెరుపు. తాజాగా టీఎంసీ ప్రధాన కార్యదర్శి (TMC General Secretary) , టీఎంసీ మాజీ ఎంపీ కూనల్ ఘోష్ (Kunal Ghosh) చేసిన ట్వీట్ మమతను (Mamata) ఇరకాటంలోకి నెట్టేసింది. పార్థా ఛటర్జీని మంత్రివర్గం నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని కూనల్ ఘోష్ ట్వీట్ చేయడం గమనార్హం. ఆయనను కచ్చితంగా బహిష్కరించాలని.. ఒకవేళ తాను చేసిన ఈ డిమాండ్‌లో తప్పు ఉందని అనిపిస్తే తనను టీఎంసీ నుంచి తొలగించేందుకు పార్టీకి అన్ని విధాలా హక్కు ఉంటుందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కూనల్ ఘోష్ ట్వీట్ చేశారు.



కూనల్ ఘోష్ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు ఒక దొంగ మరో దొంగను పార్టీ నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాడని వెటకారం చేశారు. నెటిజన్లు అలా స్పందించడానికి కారణం లేకపోలేదు. పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పార్థా ఛటర్జీని టీఎంసీ నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్న కూనల్ ఘోష్ కూడా ఒకప్పుడు శారదా చిట్‌ఫండ్ స్కాంలో ఇరుక్కుని జైలు జీవితం గడిపారు. శారదా చిట్‌ఫండ్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడిన వ్యవహారంలో కూనల్ ఘోష్‌ను ఈడీ అప్పట్లో అరెస్ట్ చేసింది. ఈ కేసులో కూనల్ ఘోష్ 34 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అక్టోబర్ 5, 2016న బెయిల్‌పై ఈ మాజీ ఎంపీ బయటకు వచ్చారు.



ఇదిలా ఉండగా.. పార్థా ఛటర్జీ విషయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని మమత చెప్పారు. ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అయితే.. కుంభకోణం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పార్థా ఛటర్జీని పార్టీ నుంచి తొలగించే విషయంలో మమత ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటుందని టీఎంసీ ముఖ్య నేత ఒకరు మాత్రం మీడియాకు చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-07-28T17:05:18+05:30 IST