కరోనా నుంచి కోలుకున్నాక పారోస్మియా... ఆహారం కుళ్లు కంపు కొడుతోందట!
ABN , First Publish Date - 2021-06-20T12:36:55+05:30 IST
కరోనా నుంచి కోలుకున్న కొంతమంది బాధితులు రుచి, వాసన శక్తులను...
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న కొంతమంది బాధితులు రుచి, వాసన శక్తులను కోల్పోవడానికి తోడు వింత సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాము ఆహారం తీసుకున్నప్పుడు అది బాగున్నప్పటికీ దాని నుంచి రసాయనాల వాసన లేదా కుళ్లు కంపు వస్తున్నట్టు అనుభూతి చెందుతున్నామని పలువురు బాధితులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న బాధితులలో తలెత్తే ఇటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో పారోస్మియా అంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు లోనయినవారు వాసనలను భిన్నంగా అనుభూతి చెందుతారు. ఫలానా వస్తువుకు గల వాసన ఏమిటో చెప్పలేకపోతారు. ఈ సమస్య గురించి బీహెచ్యూ న్యూరాలజీ ప్రొఫెసర్ అజయ్ నాథ్ మిశ్రా మాట్లాడుతూ పారోస్మియాకు ఒక కారణం జలుబు లేదా వైరస్ అని అన్నారు. ఈ కారణంగా ఘ్రాణ (వాసన సామర్ధ్యం) దెబ్బతింటుందని వివరించారు. శ్వాసకోశ ఎగువ భాగంలో సంక్రమణ కారణంగా ఘ్రాణ న్యూరాన్లు దెబ్బతింటాయి. వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లు తాగేవారికి కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇటువంటి సమస్య నుంచి బాధితులు మెల్లమెల్లగా కోలుకుంటారన్నారు.