పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి

ABN , First Publish Date - 2022-05-21T06:33:56+05:30 IST

శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు రైతులకు చేరితేనే ప్రయోజనం ఉంటుందని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సూచించారు.

పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, హాజరైన అధికారులు

ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి

వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి 

అనకాపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు రైతులకు చేరితేనే ప్రయోజనం ఉంటుందని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, మాట్లాడుతూ, మండల కేంద్రాల్లో అభ్యుదయ రైతులతో శాస్త్రవేత్తలు సమావేశాలు ఏర్పాటు చేసి పంటల సాగులో ఆధునిక పద్ధతుల గురించి వివరించాలన్నారు. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా  ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని  వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా అటవీ అధికారితో  మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాలు, ఎరువుల అవసరాలు,  లభ్యతను సరిచూసుకొని ఆర్‌బీకేల ద్వారా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.   ఉద్యాన శాఖ అధికారి ప్రభాకరరావు, మత్స్యశాఖ అధికారి లక్ష్మణరావు, శాస్త్రవేత్త భరతలక్ష్మి, సలహా మండలి సభ్యులు ఎస్‌.రమణ, ఆర్‌.గంగునాయుడు, అడారి సూరి అప్పారావు పీవీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T06:33:56+05:30 IST