సెలవులిచ్చే ఆలోచన లేదు.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు

ABN , First Publish Date - 2022-01-18T22:50:52+05:30 IST

విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే

సెలవులిచ్చే ఆలోచన లేదు.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. పాఠశాలలు మూసివేసే ఆలోచన లేదన్నారు. సోమవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవడానికి, కొవిడ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదని, పాఠశాలలు మూసివేసే ఆలోచన లేదన్నారు. సంక్రాంతి అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారని చెప్పారు. తొలిరోజు సోమవారం 61 శాతం హాజరు నమోదైందని తెలిపారు.  


పాఠశాలలకు సెలవులివ్వాలి: లోకేశ్‌
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఎంతోమంది ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేయకుండా.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కోరారు. కాగా.. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించి, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

సెలవులు ప్రకటించాలి: పవన్‌ కల్యాణ్‌
‘‘కరోనా థర్డ్‌వేవ్‌ ఆందోళనకరంగా ఉంది. ఏపీలో విద్యా సంస్థలను కనీసం ఈనెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను వైరస్‌ బారి నుంచి కాపాడుకోగలం. కేసులు పెరిగితే చూద్దామని అనడం విద్యాశాఖ మంత్రి బాధ్యతరాహిత్యాన్ని తెలియజేస్తోంది’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించార. స్కూళ్లకు ససెలవులు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2022-01-18T22:50:52+05:30 IST