స్థిరంగా ఏలేరు వరద
ABN , First Publish Date - 2020-09-20T10:20:21+05:30 IST
ఏలేరు వరద స్థిరంగా కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి వరద జలాలు విడుదల కొనసాగుతుండటంతో
వారంరోజులుగా ముంపులోనే పొలాలు
గొల్లప్రోలు రహదారులపై నీటి ప్రవాహం
గొల్లప్రోలు/పిఠాపురం, సెప్టెంబరు 19: ఏలేరు వరద స్థిరంగా కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి వరద జలాలు విడుదల కొనసాగుతుండటంతో పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలు, మండలాల పరిధిలోని గ్రామాల్లో పంటపొలాలు ముంపులోనే ఉన్నాయి. సుమారు ఐదువేల ఎకరాల్లోని వరి పంట వారం రోజులుగా వరద నీటిలో ఉండటంతో కుళ్లిపోతోంది. పంట దాదాపు కోల్పోయినట్టేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో పొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఏలేరు కాలువలకు పలు ప్రాంతాల్లో పడిన గండ్లు నుంచి నీరు పొలాలు మీదుగా ప్రవహిస్తుండడంతో నష్టం అధికంగా జరిగింది. గొల్లప్రోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోనే గండి పడటంతో వరద నీరు చుట్టముట్టింది. పట్టణ పరిధిలో ప్రధాన రహదారిపై మూడు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. రిజర్వాయర్ నీటి విడుదలను శనివారం పదివేల నుంచి తొమ్మిదివేల క్యూసెక్కులకు తగ్గించినప్పటికీ ఆ ప్రభావం అంతగా కనిపించలేదు.