అజ్ఞాతాన్ని వీడిన పరంబీర్
ABN , First Publish Date - 2021-11-26T08:42:04+05:30 IST
ముంబై పోలీసు మాజీ చీఫ్ పరంబీర్ సింగ్ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు.
- ముంబై క్రైంబ్రాంచ్లో విచారణకు హాజరు
- పరంబీర్ తీరును తప్పుబట్టిన హోంమంత్రి
ముంబై, నవంబరు 25: ముంబై పోలీసు మాజీ చీఫ్ పరంబీర్ సింగ్ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు. మహారాష్ట్ర హోంమంత్రి(ప్రస్తుతం మాజీ) అనిల్ దేశ్ముఖ్ ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్ల లంచం వసూలు చేయాలని పోలీసులను ఆదేశించారంటూ ఆరోపణలు చేశాక.. పరంబీర్ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరంబీర్పై బెదిరంపు వసూళ్లకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి. అరెస్టు అవకాశాల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల అరెస్టు నుంచి సుప్రీంకోర్టు భద్రత కల్పించడంతో.. గురువారం ఆయన నేరుగా ముంబై క్రైంబ్రాంచ్లో విచారణకు హాజరయ్యారు. తాను పోలీసు దర్యాప్తునకు సహకరిస్తానని ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. కాగా.. ఓ సీనియర్ పోలీసు అధికారి అయిన పరంబీర్ సింగ్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం తనను షాక్కు గురించేసిందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ పేర్కొన్నారు. గతంలో ముంబై, థానె నగరాలకు పోలీసు కమిషనర్గా పనిచేసిన పరంబీర్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.