పారా ఒలింపిక్స్లో భవీనాబెన్కు రజతం
ABN , First Publish Date - 2021-08-29T14:15:45+05:30 IST
టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్లో...
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్ ఝోతో పోటీపడ్డారు. తొలి గేమ్లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన భవీనాబెన్ తరువాత వెనుకంజ వేశారు. పసిడి పోరులో చైనా క్రీడాకారిణి యింగ్ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు. దీంతో భవీనాబెన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టోక్యో పారాలింపిక్స్లో రజతాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా భవీనాబెన్ నిలిచారు.
తిండి, నిద్ర లేకుండా..
భవినాబెన్కు టీటీ అంటే ప్రాణం. అది ఎంతగా అంటే ఆటకోసం ఒక్కోసారి కడుపునిండా తినేదికాదు.. కంటి నిండా నిద్రపోయేదీ కాదు. ఏడాది వయస్సులోనే పోలియో సోకడం, ఆపై డాక్టర్లకు చూపినా వారి సూచనలు పాటించకపోవడం దరిమిలా ఆమె నడుము భాగం వరకు చచ్చుబడిపోయింది. అయితే తన వైకల్యానికి ఆమె బాధపడుతూ కూర్చోలేదు. ఏదో ఒకటి సాధించి దివ్యాంగులు కూడా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోరని నిరూపించాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఆ క్రమంలో అహ్మదాబాద్లోని ‘బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్’కు రావడం, అక్కడ దివ్యాంగ బాలలు టీటీ ఆడడం చూసి ఆమె ఆ క్రీడపట్ల మొగ్గుచూపింది. ఆపై దానినే కెరీర్గా ఎంచుకుంది.
ఎంతో సాధన చేసి ఢిల్లీలో జరిగిన క్లబ్ స్థాయి టోర్నీలో కాంస్య పతకం గెలవడంతో భవినా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇంకా కష్టపడితే టీటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని గుర్తించింది. ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. ఆ క్రమంలో కొన్నిసార్లు తిండి, నిద్రను కూడా పక్కనపెట్టింది. ఆ ఫలితమే నేడు ఆమె పారాలింపిక్స్లో చరిత్ర సృష్టించే స్థాయికి చేరడం. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని సుంధియా గ్రామం భవినా స్వస్థలం. ఆమె తండ్రి హస్ముఖ్భాయ్ పటేల్ చిన్న వ్యాపారి. స్వస్థలం నుంచి అహ్మదాబాద్ చేరడం తన జీవితంలో ఊహించని మలుపుగా భవినా చెబుతుంది. ఆమె భర్త నికుల్ పటేల్ జూనియర్ స్థాయిలో క్రికెట్ ఆడడం విశేషం.