నగరివాసుల్లో భయాందోళన

ABN , First Publish Date - 2020-04-09T12:22:55+05:30 IST

నగరిలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడడంపై పట్టణవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరివాసుల్లో భయాందోళన

నగరి, ఏప్రిల్‌ 8 : నగరిలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడడంపై పట్టణవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.రెండు రోజుల క్రితం రెండు పాజిటివ్‌ కేసులు రావడం, ప్రస్తుతం వారి బంధువుల్లోనే మరో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చిందని తెలిసి భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు కీళపట్టు, రాంనగర్‌ ప్రాంతాల నుంచి ఒక కి.మీ దూరం చుట్టుపక్కల 144వ సెక్షన్‌ విధించారు.ఏ ఒక్కరినీ రోడ్లపై తిరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


సీఐ మద్దయ్య చారి, కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు ఉధ్రుతం చేశారు.  ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు మహిళల కుటుంబ సభ్యులు ఆరుగురిని వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతికి పంపారు.పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు నిర్ణయించారు.రెడ్‌జోన్‌లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని జేసీ-2 చంద్రమౌళి,ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా  కోరారు.


ప్రజలు బయటకు రాకుండా, ఇళ్ళలోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని  వైద్యాధికారి రవిరాజు సూచించారు.రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగరి రూరల్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. బుధవారం ఆయన తన సిబ్బందితో నిండ్రలోని రెడ్‌జోన్‌ ప్రాంతాలను పరిశీలించారు.  

Updated Date - 2020-04-09T12:22:55+05:30 IST