పంచాయతీ కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2021-04-16T05:35:01+05:30 IST
పంచాయతీ కార్మికుల 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ డిమాండ్ చేశారు.
జీతాలు అందక 5 నెలలుగా పస్తులు
చెల్లించకపోతే 23 నుంచి సమ్మె
పొదిలి రూరల్, ఏప్రిల్ 15 : పంచాయతీ కార్మికుల 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయం ముందు కార్మికుతో కలిసి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆకలితో అలమటిస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో కు టుంబాలు సతమతమవుతున్నాయని అన్నారు. అయినా అధికారులు జీతాలు చెల్లించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీగా ఏర్పాటు చేసినప్పటికీ అధికారాలు బదాలాయించలేదన్నారు. దీంతో కార్మికుల జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింద న్నారు. పంచాయతీ సాధారణ కార్యక్రమాల నిర్వహణకు కూడా డబ్బు సమస్య ఉందన్నారు. అవసరమైన అనుమతులు తెప్పించకోవడంలో జిల్లా అధికారులు, కమిషనర్ వైఫల్యం చెందారన్నారు. ఇప్పటికైనా కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోపక్క కరోనా, సీజనల్ వ్యాధులతో పలు కార్మిక కుటుంబాలు బాధపడుతున్నాయని, వైద్యానికి డబ్బులు లేని దయనీయ పరిస్థితిలో ఉన్నారని రమేష్ పేర్కొన్నారు. మూడు ఏళ్లుగా కార్మికుల పీఎఫ్ నగదు కూడా చెల్లించడంలేదన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 23 నుంచి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. కార్య క్రమంలో నగర పంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.నాగులు, డి. సుబ్బయ్య, బి.కోటేశ్వరరావు, సుబ్బులు, హజరత్తమ్మ, రాజయ్య పాల్గొన్నారు.