తేలని.. పంచాయితీ

ABN , First Publish Date - 2022-07-10T05:16:34+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో బదిలీలు ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా కార్యాలయాలల్లో బదిలీలు పూర్తయి విధులకు కూడా హాజరవుతున్నా.. ఇక్కడ మాత్రం ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు.

తేలని.. పంచాయితీ
కలెక్టరేట్‌లోని డిపిఒ కార్యాలయం

 ఈవోపీఆర్డీల బదిలీల జాబితా పెండింగ్‌

నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు

 

        (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో బదిలీలు ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా కార్యాలయాలల్లో బదిలీలు పూర్తయి విధులకు కూడా హాజరవుతున్నా.. ఇక్కడ మాత్రం ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,042 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 562 పంచాయతీ కార్యదర్శుల పోస్టులున్నాయి. దీనిలో 276మంది బదిలీల కోసం దరఖాస్తు చేశారు. మరో 50 మందిని వివిధ కారణాలతో బదిలీ చేయాలని అదికార పార్టీనేతల నుంచి ప్రతిపాదనలు అందినట్లు అధికా రులు వివరించారు. 32 మండలాల్లో ఈవోపీఆర్డీలను బదిలీ చేయాలని ప్రతిపాదించారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా గుంటూరు, బాపట్ల, పల్నాడు  డీపీవోలు వారం రోజులు దీనిపై కసరత్తు చేశారు. 

అయితే గ్రేడ్‌లను పరిగణనలోకి తీసుకోలేదని పీఆర్‌ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు రావడంతో మరో జాబితా రూపొందించాల్సి వచ్చింది. అసోసియేషన్‌ నేతలు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, కల్తీ బ్లీచింగ్‌ సూత్రధారులు బదిలీల్లో కొంతమందికి అనుకూలంగా సిఫారసులు చేసినట్టు సమాచారం.  ఒకవైపు గ్రేడ్‌లు అతిక్రమించకుండా, సిఫారుసులు, నజరానాలను సమన్వయ పరుస్తూ బదిలీలు చేయాల్సి రావడంతో ఆలస్యమైనట్టు   గుసగుసలు వినిపిస్తున్నాయి.

బదిలీలల్లో ఆయా జిల్లా కలెక్టర్ల సంతకాల కోసం జాప్యం జరిగినట్లు చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన బదిలీలల్లో ఎందుకు సంతకాలు చేయాలని కలెక్టర్లు ప్రశ్నించటంతో జాబితా కొలిక్కి రాలేదంటున్నారు. జిల్లాలో అన్ని కార్యాలయాల్లో బదిలీలు పూర్తయినా డీపీవో కార్యాలయంలోనే ఎందుకు పూర్తికాలేదని ఉద్యోగ సంఘనేతలు ప్రశ్నిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం కావటంతో ఈ నెల 10 వరకు బదిలీ జాబితా విడుదల అయ్యే అవకాశం లేదు. సోమవారం స్పందన కార్యక్రమం వుంది దీంతో ఈ నెల 12వ తేదీన జిపిల బదిలీలు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.  

 



Updated Date - 2022-07-10T05:16:34+05:30 IST