పోలీసుల త్యాగం అనిర్వచనీయం

ABN , First Publish Date - 2022-10-08T05:33:14+05:30 IST

పోలీసు శాఖకు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన వారి, విధుల్లో మరణించిన పోలీసుల త్యాగం అనిర్వచనీయమని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

పోలీసుల త్యాగం అనిర్వచనీయం
, సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రవి శంకర్‌రెడ్డి

సమావేశంలో ఎస్పీ రవిశంకర్‌రెడ్డి

నరసరావుపేట లీగల్‌, అక్టోబరు 7: పోలీసు శాఖకు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన వారి, విధుల్లో మరణించిన పోలీసుల త్యాగం అనిర్వచనీయమని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆయా కుటుంబాలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారికి చెందిన శాఖాపరమైన సమస్యల గురించి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన, మృతుల పోలీసు కుటుంబాల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. ఆయా కుటుంబాలకు రావాల్సిన రాయితీలు, పరిహారాల బిల్స్‌ ఏ స్థాయిలో ఎవరి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలపై కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ కారణాలతో మరణించిన పోలీసు ఉద్యోగుల్లో కొంత మందికి, అనారోగ్యంతో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ నాగయ్య కుటుంబానికి వివిధ రాయితీలు, పరిహారాలు అందాల్సి ఉన్నట్లు గుర్తించారు. అర్హత కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కొరకు ఇప్పటికే ప్రతిపాదనలను సంబంధిత అధికారులకు పంపినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన తక్షణమే పెండింగ్‌ బిల్లుల మంజూరుకు, కారుణ్య నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని కార్యాలయ ఉద్యోగులను ఆదేశించారు. కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ బిందుమాధవ్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ రామచంద్రరాజు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T05:33:14+05:30 IST