పామాయిల్ సాగుతో రైతుకు మంచి ఆదాయం
ABN , First Publish Date - 2022-06-29T06:54:38+05:30 IST
పామాయిల్ సాగుతో రైతుకు మంచి ఆదాయం లభిస్తుందని విజయరాయి ఆయిల్పామ్ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు.
ఘంటసాల, జూన్ 28 : పామాయిల్ సాగుతో రైతుకు మంచి ఆదాయం లభిస్తుందని విజయరాయి ఆయిల్పామ్ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. డెల్టాలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం డాక్టర్ మాధవీలత బృందం ఘంటసాల విచ్చేసి రై తులతో మాట్లాడారు. సారవంతమైన భూములతోపాటు మంచి గాలి, నీరు, వాతావరణం అనుకూలంగా ఉన్న భూముల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతులు ఇవ్వటం జరిగిందన్నారు. పమిడిముక్కల, మొవ్వ, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని కొన్ని ప్రాంతాలను పరిశీలించి ఈ భూములు ఆయిల్ సాగుకు అనుకూలమా? కాదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎకరాకు 49 నుంచి 57 మొక్కలు నాటితే నాలుగు సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావటంతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. మొదటి నాలుగు సంవత్సరాల్లో సాగులో అంతర్ పంటలైన అపరాలు, మొక్కజొన్న, శనగ, కూరగాయలను సాగు చేసుకుంటూ మొక్కలను అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు. రైతులు అడిగిన పలు సందేహాలను ఆమె నివృత్తి చేశారు. ఘంటసాలలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి జె.జ్యోతి, ఘంటసాల, మొవ్వ మం డలాల ఉద్యానశాఖాధికారి ఈ.హరిచందన్, ఉద్యానవన శాఖాధికారి జి.లక్పతి, రైతులు విజయ్ కుమార్, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, మూల్పూరి వెంకయ్య, మురళీకృష్ణ, వేమూరి రమేష్, గొర్రెపాటి సురేష్ పాల్గొన్నారు.